నదులకు భారీగా వరద నీరు... పుకార్లను నమ్మవద్దంటూ ఏపీఎస్డీఎంఏ అలర్ట్

  • ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు
  • గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులకు వరద నీరు
  • దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు
నైరుతి రుతుపవనాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) అలర్ట్ జారీ చేసింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపింది. 

వరద ప్రవాహం ఇంకా హెచ్చరిక స్థాయిని చేరలేదని, అయినప్పటికీ దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున ఆయా నదుల పరీవాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయరాదని హెచ్చరించింది. 

కాగా, రాత్రి 7 గంటల సమయానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 35.3 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో 4.44 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో కూడా అదే స్థాయిలో 4.44 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అటు, తుంగభద్ర నదిలోనూ 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండడంతో ప్రభావిత జిల్లాల్లోని మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు.

వర్ష సూచనఏపీలోని పలు జిల్లాలకు ఏపీఎస్డీఎంఏ వర్ష సూచన చేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 

APSDMA
Andhra Pradesh State Disaster Management Authority
Godavari River
Krishna River
Tungabhadra River
Heavy Rains
Flood Alert
Rainfall Forecast
Andhra Pradesh Floods
Bhadrachalam

More Telugu News